: విజ‌య్ మాల్యా కోసం.. లండన్ కు సీబీఐ అధికారులు

భార‌తీయ బ్యాంకుల్లో రూ.9 వేల కోట్లు ఎగ్గొట్టి ఎంచ‌క్కా విమానం ఎక్కి లండన్ వెళ్లిపోయిన విజ‌య్ మాల్యాను లండ‌న్ పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. అక్క‌డి వెస్ట్‌మినిస్ట‌ర్ కోర్టులో ఆయనను పోలీసులు హాజ‌రుపర్చనున్నారు. లండ‌న్ కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 9.30 గంట‌ల‌కు ఆయ‌నను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో, త్వ‌ర‌లోనే సీబీఐ అధికారులు మాల్యా విష‌య‌మై లండన్‌కు బ‌య‌లుదేర‌నున్నారు. వీలైనంత త్వ‌రగా ఆయ‌న‌ను భారత్‌కు తీసుకురానున్నారు. విజ‌య్‌మాల్యాపై నాన్ బెయిల‌బుల్ వారెంట్ కూడా ఉన్న విష‌యం తెలిసిందే.  

గ‌త ఏడాది మార్చి 2న విజ‌య్ మాల్యా లండన్‌కు పారిపోయారు. మాల్యాకు కింగ్ ఫిష‌ర్ స‌హా ఎన్నో కంపెనీలు ఉన్నాయి. విజ‌య్ మాల్యాను అప్ప‌గించాల‌ని గ‌తంలో భార‌త్ ద‌ర‌ఖాస్తు చేసుకోగా అక్క‌డి చట్టాలు అందుకు అనుగుణంగా లేకపోవడంతో అది వీలుకాలేదు. మొత్తం 17 బ్యాంకుల్లో ఆయ‌న లోను తీసుకున్నారు. త‌న‌కు ఉన్న‌ ఆస్తుల‌ను సెక్యూరిటీగా చూపి అందుకు ఎన్నో రెట్ల లోన్లు తీసుకున్నారు.

More Telugu News