: భార్య తమిళ హీరోయిన్... ఎంపీగా ఐడీ కార్డు... బీఎండబ్లూ, బెంజ్ కార్లు... సుకాష్ లీలలు అన్నీ ఇన్నీ కాదు!

టీటీవీ దినకరన్ కేసులో బ్రోకర్ గా వ్యవహరించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన సుకాష్ చంద్రశేఖర్ గురించిన మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2013లో ఢిల్లీ కేంద్రంగా ఓ కంపెనీని పెట్టి రూ. 3 వేల కోట్ల విలువైన నకిలీ బీమా పాలసీలను విక్రయించి భారీ మొత్తంలో డబ్బు సంపాదించాడని, ఆ డబ్బుతో అత్యంత విలాసవంతమైన జీవితం గడిపాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. తాను ఎంపీనన్న తప్పుడు ఐడీ కార్డులు సృష్టించి వాటి సాయంతో తిరిగాడని, అతని వద్ద ఆస్టన్ మార్టిన్, రోల్స్ రాయిస్, లాండ్ క్రూయిజర్, హమ్మర్, బీఎండబ్ల్యూ, మెర్సిడిస్ బెంజ్, ఆడి కార్లు ఉన్నాయని, ఆ కార్లకు ఎంపీ అన్న నేమ్ ప్లేట్లు పెట్టుకున్నాడని ఓ పోలీసు అధికారి వెల్లడించారు.

నిత్యమూ తన వెంట బాడీగార్డులను వెంట బెట్టుకుని తిరుగుతూ, తాను కరుణానిధి మనవడినని చెప్పుకుని పలు మోసాలకు పాల్పడ్డాడని తెలిపారు. తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన లీనా మారీ పాల్ ను వివాహం చేసుకుని ఆమెతో కలిసి మోసాలకు పాల్పడ్డాడని తెలిపారు. రెండేళ్ల క్రితం ఆమెతో కలిసి ఇన్వెస్టర్లను మోసం చేసి డబ్బు నొక్కేసిన కేసులో అరెస్టయ్యాడని, ఆపై వారిద్దరూ కొంతకాలం జైల్లో ఉండి, బెయిల్ పై బయటకు వచ్చారని తెలిపారు.

సుకాష్ అత్యంత సునాయాసంగా స్పెయిన్, గుజరాతీ సహా ఎనిమిది భాషలు మాట్లాడగలడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మార్చి 2013లో ఓ జాతీయ బ్యాంకును మోసం చేసిన కేసుతో పాటు కర్ణాటక ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన రూ. 132 కోట్ల విలువైన శానిటరీ నాప్కిన్ మెషీన్ ఆర్డర్ వెనుక, అంతకుముందు 2007లో ఓ ల్యాండ్ డీల్ కోసం సీనియర్ సిటిజన్ ను 1.4 కోట్ల మేరకు మోసం చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడని తెలిపారు.

More Telugu News