: తమిళనాట వేగంగా మారుతున్న పరిణామాలు... శశికళకు షాకే!

తమిళనాడు అన్నాడీఎంకేలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వర్గాలు ఏకం కానున్నాయి. ఈ మేరకు రెండు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. చిన్నమ్మ శశికళ జైలుకెళ్లినా ప్రభుత్వంపై తన పట్టు ఉండాలని భావించి, ఏరికోరి తెచ్చుకున్న తన అక్క కొడుకు దినకరన్ మెడకు కేసుల ఉచ్చు పకడ్బందీగా చుట్టుకోవడంతో మన్నార్ గుడి మాఫియా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆ సెగ ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గానికి కూడా తాకడంతో ఏం చేయాలో తోచక తికమకపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో మచ్చలేని నేతగా పేరొందిన పన్నీరు సెల్వం పెద్దదిక్కుగా అన్నాడీఎంకే నేతలకు కనిపిస్తున్నారు.

విభేదాల కంటే, పన్నీరు సెల్వం మద్దతుతో పార్టీని పటిష్ఠంగా ఉంచొచ్చని భావిస్తున్నారు. దీంతో ఈ రెండు వర్గాలు కలిసిపోయే దిశగా చర్చలు జరుగుతున్నాయని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. తాము విడిపోయిన అన్నదమ్ముల్లాంటి వారమని, కలిసిపోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదని రెండు వర్గాల నేతలు పేర్కొంటున్నారు. దీనికి తోడు జాతీయ ఎన్నికల సంఘం శశికళ, దినకరన్ పై వేటు వేసే అవకాశం ఉందని, ప్రస్తుతం వివిధ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దినకరన్ ను త్వరలో అరెస్టు చేస్తారని, ప్రచారం జరుగుతోంది. దీంతో శశికళ, మన్నార్ గుడి మాఫియాకు ఊహించని కోలుకోలేని దెబ్బతగిలిందని తమిళ రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. 

More Telugu News