: సంజయ్ దత్ కు తప్పని కోర్టు తిప్పలు... అంధేరీ కోర్టుకు హాజరు!

బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ కు కోర్టు తిప్పలు తప్పడం లేదు. అక్రమ ఆయుధాలను కలిగి ఉన్నాడన్న కేసులో ఇటీవలే జైలు శిక్షను సంజూ పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు తాజాగా మరో కేసు అతన్ని వెంటాడుతోంది. నిర్మాత షకీల్ నురానీని బెదిరించిన కేసులో అతను నేడు అంధేరీ న్యాయస్థానానికి హాజరయ్యాడు. 2002లో నూరానీ నిర్మించిన 'జాన్ కీ బాజీ' సినిమాలో ప్రధాన పాత్రను పోషించేందుకు సంజూ రూ. 50 లక్షల అడ్వాన్స్ తీసుకున్నాడట.

అయితే, సంజూ షూటింగ్ కు హాజరు కాకపోవడమే కాక... అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వలేదట. దీంతో, షకీల్ నురానీ కోర్టుకెక్కాడు. ఆ సమయంలో సంజయ్ దత్ తరపున తనకు అండర్ వరల్డ్ నుంచి బెదిరింపులు వచ్చాయని తన ఫిర్యాదులో నురానీ పేర్కొన్నాడు. ఈ కేసుకు సంబంధించి సంజూకు పలుమార్లు సమన్లు జారీ చేసింది కోర్టు. అయినా, సమన్లను పట్టించుకోలేదాయన. దీంతో, ఐదు రోజుల క్రితం సంజూకు అంధేరీ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో, ఈ రోజు ఆయన కోర్టుకు హాజరయ్యారు. పిటిషన్ ను విచారించిన కోర్టు... కేసును వాయిదా వేసింది.

More Telugu News