: తెలంగాణ సీఎం కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తుతూ ముద్రగడ పద్మనాభం లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏపీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖను రాశారు. ఎన్నికల మ్యానిఫెస్టో ఓ చిత్తు కాగితం కాదని మీరు మాత్రమే నిరూపించారంటూ కితాబిచ్చారు. ఆయన్ను అభినందిస్తూ, ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్ల కోటాను పెంచుతూ, అసెంబ్లీలో తీర్మానం చేయడం గొప్ప విషయమని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. పదవులు, ఆస్తులు శాశ్వతం కాదని గుర్తు చేస్తూ, మాట నిలబెట్టుకోవడమే ముఖ్యమని, ఆ పని చేసిన కేసీఆర్ పై తనకు ఉన్న గౌరవం మరింతగా పెరిగిందని చెప్పారు.

దళిత మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ కన్న కలలను సాకారం చేయడంలో కేసీఆర్ సాగిస్తున్న ప్రయాణం మరువలేనిదని, ఓట్లు వేసిన ఓటర్లను గౌరవించాలన్న ఆయన ఉద్దేశం గొప్పదని చెప్పారు. పదవులు, ఆస్తులు, జీవితాలే శాశ్వతమన్నట్టు తమ ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారని, హామీలను నెరవేర్చాలని అడిగితే, లాఠీలతో కొట్టించడం, అక్రమ కేసులు పెట్టి బాధించడం వంటి పనులు చేస్తున్నారని ఇదే లేఖలో చంద్రబాబుపై తన ఆగ్రహాన్ని కూడా ముద్రగడ వ్యక్తం చేశారు. ఇకపై జరిగే ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని అడ్డుకుని, కొట్ల ధనం దుర్వినియోగం కాకుండా ఎన్నికలకు వెళ్లి మరింత మంచి పేరును తెచ్చుకోవాలని ముద్రగడ తన లేఖలో కేసీఆర్ ను కోరారు.

More Telugu News