: తెలంగాణలో వడగాల్పులు వీచే అవకాశం!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అదనంగా పెరగవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటే అవకాశం ఉందని  వాతావరణ కేంద్రం సంచాలకురాలు డాక్టర్ కె. నాగరత్న పేర్కొన్నారు. నిన్న హైదరాబాద్ లో పలు చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నారు.

సాధారణంగా హైదరాబాద్ లో గాలిలో తేమ 52 శాతం ఉండాలని, కానీ, 31 శాతానికి పడిపోయిందని అన్నారు. దీంతో, హైదరాబాద్ వాసులు ఉక్కపోతతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు తలెత్తాయన్నారు. వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం, సాధారణం కన్నా 4 డిగ్రీలు అదనంగా పెరిగితే వడగాల్పుల తీవ్రత ఎక్కువవుతుందన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ లో నిన్న అత్యధిక ఉష్ణోగ్రత 44.4 డిగ్రీలు నమోదైనట్టు చెప్పారు. హైదరాబాద్ లో గత ఏడాది ఏప్రిల్ 14వ తేదీన 43 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదు కాగా, దానికి చేరువగా నిన్న42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని చెప్పారు.

More Telugu News