: అంపైర్ల ఘోర తప్పిదం... ఆరో ఓవర్ ఆఖరి బంతికి ఫోర్ కొట్టి, 7వ ఓవర్ తొలి బంతిని ఫేస్ చేసిన డేవిడ్ వార్నర్

నిన్న రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ పోరులో ఓ ఘోర తప్పిదం జరిగిపోగా, దానిని మైదానంలోని అంపైర్లతో పాటు టీవీ అంపైర్ సైతం గుర్తించలేకపోయారు. జస్ ప్రీత్ బుమ్రా వేసిన ఆరో ఓవర్ ఆఖరి బంతిని మైదానం దాటించి నాలుగు పరుగులు పిండుకున్న సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఆపై ఇవతలి ఎండ్ కు వచ్చి, మిచెల్ మెక్ క్లెనాగన్ వేసిన ఏడో ఓవర్ తొలి బంతిని ఆడాడు. ఫీల్డ్ లో ఉన్న అంపైర్లు సీకే నందన్, నితిన్ మీనన్ లతో పాటు టీవీ అంపైర్ వైసీ బార్డే సైతం దీన్ని గమనించక పోవడం గమనార్హం.

కాగా, ఇదే మైదానంలో గత సంవత్సరం నందన్, మీనన్ లు అంపైరింగ్ చేస్తూ, పొరపాటు మీద పొరపాటు చేసి విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. కోల్ కతా నైట్ రైడర్స్ తో నాడు మ్యాచ్ జరుగగా, ఇద్దరు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు అవుట్ కాకపోయినా, వీరు అవుట్ గా ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది.

More Telugu News