: 'రోబో' సీక్వెల్ కోసం రజనీకాంత్ కంటే అక్షయ్ కుమార్ ఎక్కువ తీసుకున్నాడట!

2010లో విడుదలై సంచలన విజయం సాధించిన 'రోబో'కు సీక్వెల్ గా శంకర్ రూపొందిస్తున్న '2.0' సినిమాలో దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్న అక్షయ్ కుమార్ ఈ సినిమా కోసం 12 రకాల గెటప్ లలో కనిపిస్తాడట. ఈ 12 గెటప్పుల కోసం అక్షయ్ కుమార్ భారీ ఎత్తున మేకప్ వేసుకోవాల్సి వస్తోంది.

తన 25 ఏళ్ల సినీ కెరీర్లో ఇంత మేకప్ ఎప్పుడూ వేసుకోలేదని అక్షయ్ చెబుతున్నాడు. అందుకే అక్షయ్ కుమార్ కు రోజుకి 2 కోట్ల రూపాయలు పారితోషికంగా ఇస్తున్నట్టు కోలీవుడ్ పేర్కొంటోంది. ఈ లెక్కన రజనీకాంత్ కు ఇచ్చే పారితోషికం కంటే అక్షయ్ కుమార్ కు ఇచ్చే పారితోషికం ఎక్కువని సినీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఈ సినిమాలో రజనీ సరసన అమీ జాక్సన్ నటిస్తుండగా, 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ తో ఇది రూపొందుతోంది. ఈ సినిమాకు సంగీతం ఏఆర్ రెహమాన్. 

More Telugu News