: టీడీపీలో చేరనున్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు?

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా, నల్లారి సోదరుల తల్లి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం మాజీ మంత్రి గల్లా అరుణ, టీడీపీ నేత అమరనాథ్ రెడ్డి, జడ్పీ చైర్మన్ గీర్వాణి చంద్రప్రకాష్ తదితరులు నల్లారి సోదరులను కలిసి పరామర్శించారు. పనిలో పనిగా, చంద్రబాబు సూచనల మేరకు కిషోర్ కుమార్ రెడ్డిని టీడీపీలో చేరాలని వారు ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. దీంతో, కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారనే వార్తలు నిజమేనేమో అనిపిస్తోంది. కాగా, రాజంపేట ఎంపీ టికెట్ తో పాటు, టీటీడీ చైర్మన్ పదవి తనకు కావాలని కిషోర్ కుమార్ రెడ్డి అడిగినట్టు తెలుస్తోంది. అయితే, ఎంపీ టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధినేత సుముఖత వ్యక్తం చేసినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. 

More Telugu News