: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కసరత్తు జరుగుతోంది!: కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించిన కసరత్తు జోరుగా సాగుతోందని, అయితే ఇందుకు సంబంధించిన కసరత్తు ముగిసేందుకు కాలపరిమితిని మాత్రం విధించలేమని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ తేల్చి చెప్పారు. ఈ నెల 12 వరకు జరిగే పార్లమెంటు సమావేశాల్లో కానీ, లేదంటే వచ్చే వర్షాకాల  సమావేశాల్లో కానీ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు ఇటీవల ఆయన చెప్పిన విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

కాగా, నేడు (గురువారం) టీడీపీ నేత సుజనా చౌదరి కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి సీట్ల పెంపుపై చర్చించనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా బిల్లు స్వరూపం గురించి, పార్లమెంటు ముందుకు ఎప్పుడు తీసుకురావాలన్న దాని గురించి చర్చిస్తారని తెలుస్తోంది. ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లును తీసుకురావాల్సిన అవసరం లేదని, జూలైలో జరగనున్న వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు ఈ బిల్లు వచ్చినా పెద్దగా తేడా ఉండదని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే వీలైనంత త్వరగా ఈ బిల్లును ప్రవేశపెట్టాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.

More Telugu News