: మటన్‌ కావాలో.. తాను కావాలో తేల్చుకోమని భార్యకు చెప్పిన భర్త!

శాకాహారి అయిన ఓ వ్య‌క్తి త‌న భార్య‌తో మ‌ట‌న్ కావాలో, తాను కావాలో తేల్చుకోమ‌ని చెప్పాడు. తాజాగా ట్విట్ట‌ర్ ద్వారా జ‌రిగిన ఓ సంభాష‌ణ‌తో ఈ విష‌యం ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకురాలు, కొరియోగ్రాఫర్‌ ఫరాఖాన్‌ భర్త శిరీష్‌ కుందర్‌ను ఆ వ్య‌క్తి ట్విట్ట‌ర్‌లో సాయం కోరాడు. పూర్తి శాకాహారి అయిన ఓ యువకుడు శాకాహార కుటుంబానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే తనకు మటన్ అంటే ఎంతో ఇష్టమని, అందుకని బయట తింటుంటానని ఆమె పెళ్లికి ముందే చెప్పింది. మాంసాహారం త‌న‌కు న‌చ్చ‌క‌పోయిన‌ప్ప‌టికీ ఆమె అందంగా ఉంద‌ని ఆయ‌న పెళ్లిచేసుకున్నాడు. అయితే, ఆమె పెళ్లయ్యాక మటన్‌ తినడం మానేస్తానని చెప్పింది. తీరాచూస్తే ఆమె మ‌ట‌న్ తిన‌డం మాన‌లేదు. ఆమె ఎవ‌రికీ తెలియ‌కుండా మాంసాహారం తినేస్తోంది. ఈ విషయం తాజాగా ఆమె భర్తకు తెలిసిపోయింది.

దీంతో ఆగ్ర‌హం తెచ్చుకున్న ఆయ‌న మటన్‌ కావాలో తాను కావాలో తేల్చుకోమ‌ని తేల్చి చెప్పాడు. అయితే, త‌న భార్య ఇప్పుడు మటన్‌ కోసం తనని వదిలేస్తుందేమోన‌ని భ‌య‌ప‌డుతున్నాడు. దీంతో ఆయ‌న త‌న బాధ‌ను శిరీష్‌ కుందర్‌కు చెప్పుకున్నాడు. అయితే, శిరీష్‌కి ఏం చెప్పాలో తెలీక‌పోవ‌డంతో మొద‌ట‌ కంగ్రాట్స్ చెప్పాడు. ఇలాంటి ప్రేమ‌క‌థ‌ను తాను మొదటిసారి వింటున్నాన‌ని, అయితే, మనుషులు ప్రేమ లేకుండా అయినా ఉండగలరు కానీ ఆహారం లేకుండా ఉండలేరు కదా? అని సమాధానం ఇచ్చాడు. ఈ ట్విట్ట‌ర్ సంభాష‌ణ‌కి విప‌రీతంగా స్పంద‌న వ‌స్తోంది.


More Telugu News