: ఏపీ కేబినెట్‌కు వింతరూపు... మంత్రులైన విపక్ష, మిత్రపక్ష ఎమ్మెల్యేలు!

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. మూడు ప్రధాన పార్టీల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. సాంకేతికంగా ఇంకా ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్న నలుగురికి మంత్రివర్గంలో చోటు లభించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే మంత్రివర్గంలో మిత్రపక్షమైన బీజేపీ, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఇప్పుడు వైసీపీకి కూడా చోటు లభించడంతో ఏపీ మంత్రివర్గం ‘ఆల్‌పార్టీ కేబినెట్’గా మారింది.

గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన వారిలో పలు దఫాలుగా 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. వారు ఇప్పటికీ వైసీపీ సభ్యులుగానే కొనసాగుతున్నారు. ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాల్లో పార్టీల సంఖ్యా బలంపై అసెంబ్లీ సచివాలయం ఓ నోట్ ఇచ్చింది. అందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 67 మంది సభ్యులున్నట్టు పేర్కొంది. నిజానికి టీడీపీలో చేరిన వారిని మినహాయిస్తే ఆ పార్టీకి మిగిలింది 46 మందే. కాగా, బీజేపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు చంద్రబాబు కేబినెట్‌లో కొనసాగుతుండగా ఇప్పుడు నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు. మిగిలిన వారు టీడీపీ ఎమ్మెల్యేలు. దీంతో బాబు కేబినెట్‌ కొత్త రూపు సంతరించుకుంది.

More Telugu News