: భార‌త్‌ను అస్థిరప‌ర్చ‌డానికి పాక్‌ కుట్ర‌: రాజ్‌నాథ్ సింగ్‌

జమ్ముకశ్మీర్‌లో నెల‌కొంటున్న ప‌రిస్థితుల దృష్ట్యా కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌పై మండిప‌డ్డారు. దాయాది పాకిస్థాన్ ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తూ.. భార‌త్‌ను అస్థిరప‌ర్చ‌డానికి కుట్ర‌లు ప‌న్నుతోంద‌ని అన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చి, జమ్ముకశ్మీర్‌లో యువతను ప‌క్క‌దారి ప‌ట్టిస్తూ, వారితో భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌పై దాడులు చేయిస్తున్నారని ఆయ‌న అన్నారు. ఆ రాష్ట్రంలోనే కాకుండా యావ‌త్ భార‌త్‌లో ప‌లు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌డానికి పాక్ కుట్ర‌లు ప‌న్నుతోంద‌ని పేర్కొన్నారు.

సోషల్‌ మీడియా ద్వారా పాకిస్థాన్ మ‌న‌ యువతను తప్పుదోవపట్టిస్తోందని రాజ్ నాథ్ సింగ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  ఆ దేశం పాల్ప‌డుతున్న చ‌ర్య‌ల గురించి భార‌త్ మొత్తానికి తెలుస‌ని అన్నారు. భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాలు కూడా అవ‌స‌ర‌మైన మేర‌కు ప్ర‌తిస్పందిస్తూనే ఉన్నాయ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం కశ్మీర్‌లో కొత్త పద్ధతి మొదలైందని, అక్క‌డి ఉగ్రవాదులను వెతికేందుకు భ‌ద్ర‌తా బలగాలు గ్రామాల్లోని ఇళ్లకు వెళ్లగానే అక్కడి యువత వారిపై రాళ్లు విసురుతున్నార‌ని ఆయ‌న చెప్పారు.

More Telugu News