: తెలుగుదేశం చేతిలో పావుగా మారిన పవన్ కల్యాణ్: రోజా మండిపాటు

జనసేన పార్టీ నేత పవన్ కల్యాణ్, తెలుగుదేశం పార్టీ చేతిలో పావుగా మారారని వైకాపా ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఏదైనా ఓ సమస్యపై వైకాపా పోరాడుతూ ఉంటే, అధికార తెలుగుదేశం పవన్ కల్యాణ్ ను తెరపైకి తెచ్చి, పాత సమస్యను తిరగదోడిస్తూ, కొత్త సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తోందని ఆమె విమర్శించారు. ఈ ఉదయం అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడిన ఆమె, మొగల్తూరు ఆక్వా ఫ్యాక్టరీలో ఐదుగురు చనిపోతే, కంపెనీ యాజమాన్యానికి చంద్రబాబు మద్దతు పలుకుతున్నారని ఆమె ఆరోపించారు.

తుందుర్రు దగ్గర పెట్టే కంపెనీలోనూ ఇటువంటి ప్రమాదాలే జరుగుతాయని ఆరోపించిన ఆమె, ఆక్వా పరిశ్రమలను సముద్రం దగ్గరే పెట్టాలని డిమాండ్ చేశారు. సమస్యలపై తమ నేత జగన్ పోరాడుతున్నారని చెప్పిన రోజా, ప్రశ్నిస్తానంటున్న పవన్ కు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. మొన్న పది మంది బస్సు యాక్సిడెంట్ లో చనిపోయిన రోజు, నిన్న ఐదుగురు చనిపోయిన రోజు వెళ్లని పవన్, తెలుగుదేశం నేతలు కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం వస్తే మాత్రం ప్రత్యక్షమవుతున్నారని అన్నారు. పవన్ 'ప్యాకేజీ కల్యాణని', 'కాసుల కల్యాణని' అభివర్ణించిన ఆమె, చంద్రబాబుకు ఓ దళారీగా పవన్ వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు.

More Telugu News