: ప్రకాష్ రాజ్ చేసిన పనిని మీరూ చేయండి: పవన్ తో అగ్రిగోల్డ్ బాధితురాలు

తమిళనాడులో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో సినీ నటుడు ప్రకాష్ రాజ్, ఢిల్లీ వీధుల్లో నిరసనలు తెలిపి, అరుణ్ జైట్లీతో మాట్లాడి వచ్చారని, ఆనాడు బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పిన పవన్ కల్యాణ్, నేడు అగ్రీగోల్డ్ బాధితుల తరఫున ప్రశ్నించేందుకు అన్ని అర్హతలనూ కలిగివున్నారని ఓ బాధిత మహిళ గొంతెత్తి అరిచింది. ప్రకాష్ రాజ్ చేసినట్టుగా, ఢిల్లీకి వెళ్లి, బాధితులకు సత్వర న్యాయం జరిపించేందుకు పవన్ మాట్లాడాలని కోరిన ఆమె, తక్షణం ప్రభుత్వ ఖజానా నుంచి చిన్న మొత్తాలను దాచుకున్న వారికి డబ్బులు ఇప్పించాలని, ఆపై ఆస్తులను వేలం వేయించి పెద్ద ఖాతాదారులకు పంచాలని ఆమె డిమాండ్ చేశారు.

 మరో బాధిత మహిళ మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా అగ్రీగోల్డ్ ను పెంచి పోషించిన వాళ్లలో ప్రభుత్వాలు కూడా ఉన్నాయని, రాష్ట్రపతుల నుంచి ముఖ్యమంత్రుల వరకూ ఆగ్రీగోల్డ్ కార్యక్రమాల్లో అతిథులుగా హాజరైనందునే, ప్రజలు ఆ సంస్థను గుడ్డిగా నమ్మారని ఆరోపించారు. 2014లో కేసు బయటకు వచ్చిన తరువాత కూడా ఆగ్రీగోల్డ్ డైరెక్టర్లలో ఒకరికి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అవార్డులిచ్చి సత్కరించారని ఆరోపించారు. పోలీసులు కూడా తమకు మద్దతివ్వడం లేదని అన్నారు. ప్రభుత్వం మెడలు వంచి సభాముఖంగా ప్రమాణం చేసి వెళ్లాలని ఆమె కోరారు.

More Telugu News