: ముగిసిన ఆసీస్ ఇన్నింగ్స్...తొలి రోజు పైచేయి టీమిండియాదే!

బోర్డర్ అండ్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు ఆడుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో తొలిరోజు టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించింది. కోహ్లీ గైర్హాజరీలో రహానే కెప్టెన్సీలో ఆడిన టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఒకటి రెండు సార్లు తడబడ్డా అద్బుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఆరంభంలో వార్నర్ కు లైఫ్ ఇవ్వడంతో అర్ధ సెంచరీ సాధించాడు. టాస్ ఓడి ఫీల్డింగ్ ప్రారంభించిన భారత జట్టు ఆరంభంలోనే బ్రేక్ అందుకుంది. రెండో ఓవర్ లో ఉమేష్ యాదవ్ రెన్ షా (1) వికెట్ తీసి షాక్ ఇచ్చాడు. అనంతరం క్రీజులో అద్భుతంగా కుదురుకుని భారీ స్కోరుపై కన్నేసిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ (111), వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (56) రాణిస్తున్న సమయంలో కుల్ దీప్ యాదవ్, వార్నర్ ను పెవిలియన్ కు పంపాడు.

అనంతరం స్మిత్ కు జత కలిసిన షాన్ మార్ష్ (8) ను ఉమేష్ యాదవ్ బోల్తా కొట్టించాడు. అనంతరం వచ్చిన హ్యాండ్స్ కొంబ్ (4) ను కుల్ దీప్ అద్భుత బంతితో బలిగొన్నాడు. తరువాత క్రీజులోకి వచ్చిన మ్యాక్స్ వెల్ (8) ను మరో అద్భుత బంతితో పెవిలియన్ కు పంపాడు. అనంతరం సెంచరీతో కదం తొక్కిన స్మిత్ (111) ను అశ్విన్ అవుట్ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆ తరువాత వచ్చిన కుమ్మిన్స్ (21)ను కుల్ దీప్ యాదవ్ అవుట్ చేశాడు. ఆ తరువాత ఒకీఫ్ (8)ను సబ్ స్టిట్యూట్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ విసిరిన బంతితో కీపర్ సాహా రన్ అవుట్ చేశాడు.

అనంతరం క్రీజులో కుదురుకుని టీమిండియా బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన మాథ్యూ వేడ్ (57) ను జడేజా బౌల్డ్ చేశాడు. చివర్లో లియాన్ (13)ను పుజారా చక్కని క్యాచ్ తో అవుట్ చేశాడు. దీంతో హాజిల్ వుడ్ (2) నాటౌట్ గా నిలిచాడు. దీంతో మొత్తం 88.3 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా జట్టు 300 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. భారత్ బౌలర్లలో కుల్ దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో రాణించగా, రెండు వికెట్లతో ఉమేష్ యాదవ్ ఆకట్టుకున్నాడు. అశ్విన్, జడేజా, భువనేశ్వర్ కుమార్ చెరొక వికెట్ తీసి వారికి చక్కని సహకారం అందించారు. టీమిండియా బౌలర్లంతా వికెట్లు తీయడం విశేషం. ఈ నేపథ్యంలో తొలిరోజు ఆటపై టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్ భారత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించారు. 

More Telugu News