: మరోసారి కుల్ దీప్ వికెట్ తీశాడు...ఏడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

బోర్డర్ అండ్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు ఆడుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో అరంగేట్రం చేసిన కుల్ దీప్ యాదవ్ రాణించడంతో ఆసీస్ పతనమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు రెండో ఓవర్ లో ఉమేష్ యాదవ్ రెన్ షా (1) వికెట్ తీసి షాక్ ఇచ్చాడు. అనంతరం క్రీజులో అద్భుతంగా కుదురుకుని భారీ స్కోరుపై కన్నేసిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ (111), వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (56) రాణిస్తున్న సమయంలో కుల్ దీప్ యాదవ్, వార్నర్ ను పెవిలియన్ కు పంపాడు.

అనంతరం స్మిత్ కు జత కలిసిన షాన్ మార్ష్ (8) ను ఉమేష్ యాదవ్ బోల్తా కొట్టించాడు. అనంతరం వచ్చిన హ్యాండ్స్ కొంబ్ (4) ను కుల్ దీప్ అద్భుత బంతితో బలిగొన్నాడు. తరువాత క్రీజులోకి వచ్చిన మ్యాక్స్ వెల్ (8) ను మరో అద్భుత బంతితో పెవిలియన్ కు పంపాడు. అనంతరం సెంచరీతో కదం తొక్కిన స్మిత్ (111) ను అశ్విన్ అవుట్ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆ తరువాత వచ్చిన కుమ్మిన్స్ (21)ను కుల్ దీప్ యాదవ్ అవుట్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 79 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 269 పరుగులు చేసింది. భారత బౌలర్లలో నాలుగు వికెట్లతో కుల్ దీప్ యాదవ్ రాణించగా, రెండు వికెట్లు తీసి ఉమేష్ యాదవ్ ఆకట్టుకున్నాడు. వారికి ఒక వికెట్ తీసి అశ్విన్ సహకరించాడు. 

More Telugu News