: కపిల్ షోను వీడిన సునీల్ గ్రోవర్, అలీ అస్ఘర్, చందన్ ప్రభాకర్

హిందీ బుల్లితెర ప్రముఖ కమెడియన్‌ కపిల్‌ శర్మకు షాక్ తగిలింది. పూటుగా తాగి విమానంలో అందరి ముందూ సహ కమెడియన్ సునీల్ గ్రోవర్ ను దుర్భాషలాడడం, చేయిచేసుకోవడంతో కపిల్ కు కష్టకాలం మొదలైంది. కపిల్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ది కపిల్‌ శర్మ షో’ నిర్వహణ గందరగోళంలో పడింది. అంతా జరిగిపోయిన తరువాత కపిల్ క్షమాపణలు చెప్పినా సునీల్ గ్రోవర్ శాంతించలేదు. ఇక షోకి వచ్చేది లేదని తేల్చిచెప్పేశాడు. దీంతో ఈ షో నుంచి మిగిలిన కమెడియన్లు అలీ అస్గర్‌, కపిల్ స్నేహితుడు చందన్‌ ప్రభాకర్‌ తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ షోలో కపిల్‌ తో పాటు కీకూ శార్దా ఒక్కడే మిగిలాడు. వారితోపాటు జడ్జి హోదాలో ఉన్న మాజీ క్రికెటర్‌, పంజాబ్ మంత్రి నవ్‌ జోత్‌ సింగ్‌ సిద్ధూ ఉన్నాడు. అయితే సిద్ధూ పాత్ర పరిమితమే... కేవలం నవ్వడం, ఒక కవితను చదవడంతో సరిపోతుంది.

దీంతో కపిల్ షో నిర్వహణ ఆందోళనలో పడింది. అయితే కపిల్ కొత్త కమెడియన్లతో ఈ షోను నడిపిస్తాడా? లేక షోను ఆపేస్తాడా? అన్నది అనుమానంగా మారింది. వాస్తవానికి కపిల్ షోలో కపిల్ తో పాటు సమానంగా ఒక రవ్వంత ఎక్కువగా సునీల్‌ గ్రోవర్, అలీ అస్గర్‌ లు ప్రధాన పాత్రధారులు. వీరిద్దరూ లేని పక్షంలో కపిల్ చేసే కామెడీ ఏమీ ఉండదు. సందర్భోచితంగా వీరిద్దరూ పండించే హాస్యం ఈ షో రేటింగ్ ను అమాంతం పెంచేసింది. వీరిద్దరూ లేకపోవడంతో ఈ షో రేటింగ్ పడిపోతుందని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. కలర్స్ ఛానెల్ లో మంచి పాప్యులారిటీ సంపాదించుకున్న ఈ షో... రెమ్యూనరేషన్ వివాదంతో సోనీ ఛానెల్ కు మారింది. ఇప్పుడు కపిల్ వ్యవహార శైలితో నిర్వహణే సందేహంగా మారింది. 

More Telugu News