: కుమారుడి కోసం చిరుతతో పోరాడిన మహిళ!

ముంబ‌యి శివారులోని ఆరే కాలనీలోని మారుమూల గిరిజన ప్రాంతంలో ఓ మ‌హిళ అత్యంత ధైర్య సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించి, చిరుత‌తో పోరాడింది. త‌న బాబును లాక్కెళ్లేందుకు ప్ర‌య‌త్నించిన చిరుత నుంచి ప‌సివాడిని కాపాడింది. ఆ ప్రాంతంలోని ఛాపాకు చెందిన 23 ఏళ్ల ప్రమీలా రింజాద్ మొన్న‌ రాత్రి 9 గంటల ప్రాంతంలో బహిర్భూమికి వెళుతూ తనవెంట త‌న‌ మూడేళ్ల కుమారుడు ప్రణయ్‌ను కూడా తీసుకెళ్లింది. అదే స‌మయంలో అక్క‌డ‌కు వ‌చ్చిన ఓ చిరుతపులి వారిపై దాడి చేసింది. ప్ర‌ణ‌య్‌ను గోళ్లతో పట్టుకున్న చిరుత ఆ బాలుడిని తీసుకెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించింది.

అయితే, గ‌ట్టిగా అరుస్తూ చిరుత వ‌ద్ద‌కు ప‌రుగెత్తిన ఆ మ‌హిళ తన బిడ్డను చిరుత పంజా నుంచి లాగేసింది. మ‌ళ్లీ గ‌ట్టిగా అరవ‌డంతో ఆ చిరుత దూరంగా పారిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ‌ ప్రణయ్‌కు ఓ ఆసుపత్రిలో ప్రాథ‌మిక‌ చికిత్స అందించారు. అనంత‌రం ఆ బాలుడిని ముంబైలోని బాలసాహెబ్ థాకరే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ బాబుకు రెండు కుట్లు వేసిన‌ట్లు, ప్ర‌స్తుతం బాబు కోలుకుంటున్నట్టు వైద్యులు చెప్పారు. చిరుత కార‌ణంగా కొన్ని రోజులుగా గ్రామంలోని కుక్కలు, కోళ్లు మాయ‌మ‌వుతున్నాయ‌ని, ఇప్పుడు చిరుత‌లు త‌మ‌పై కూడా దాడి చేస్తున్నాయ‌ని ఆ ప్రాంత‌వాసులు చెబుతున్నారు. చిరుత దాడిచేసిన చోట సీసీ కెమెరాలను అమర్చామ‌ని చిరుత‌ను ప‌ట్టుకుంటామ‌ని అధికారులు పేర్కొన్నారు.

More Telugu News