: నేను కూడా బాహుబలినే!: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్

తాను కూడా బాహుబలినే అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, ఎవరైతే ప్రజలను ఆకర్షిస్తారో వాళ్లే బాహుబలి అని, కాంగ్రెస్ లో చాలా మంది బాహుబలులు ఉన్నారని, తాను కూడా బాహుబలినేనని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ఆయన విమర్శలు గుప్పించారు. ఇరవై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న నాయకుల కంటే, కేటీఆర్ ఎంతో ధీమాగా మాట్లాడుతున్నారని, అసెంబ్లీలో మాట్లాడే మాటలు .. క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలు వేరుగా ఉంటాయని అన్నారు.

మంచినీటిలో డ్రైనేజ్ వాటర్ కలుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం, అన్ని మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ నేతలు పర్యటించాలని వీహెచ్ సూచించారు. ఈ అంశంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓ లేఖ రాస్తానని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై కూడా వీహెచ్ విమర్శలు గుప్పించారు. యూపీలో మాత్రమే రైతు రుణ మాఫీ చేస్తే పోరాటం చేయక తప్పదని అన్నారు.

More Telugu News