: భర్తను చంపిన వ్యక్తిని హతమార్చి ప్రతీకారం తీర్చుకున్న భార్య!

తన భర్తను చంపినవారిపై ఓ భార్య ప్రతీకారం తీర్చుకున్న ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గోరంట్ల గ్రామంలో చోటు చేసుకుంది. సత్తెనపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...2014 డిసెంబరులో కొత్త గోరంట్లకు చెందిన దొంగల సాంబశివరావు భార్య చంద్రకళతో అదే గ్రామానికి చెందిన కల్లు వెంకట్రావు అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై పంచాయతీ పెట్టించగా, వెంకట్రావు తానేమీ తప్పు చేయలేదని చెబుతూ గ్రామ పెద్దల సమక్షంలో ఆమెకు క్షమాపణ చెప్పేందుకు నిరాకరించాడు. దీనిని అతని మేనమామ తెల్లగడ్డల ధరణి నాగేశ్వరరావు సమర్ధించారు.

దీంతో నాగేశ్వరరావుపై కక్ష పెంచుకున్న చంద్రకళ భర్త సాంబశివరావు, అతని సోదరులు రామారావు, సుబ్బారావు 2014 డిసెంబరు 12న అతనిని నరికి చంపేశారు. దీంతో ఆ ముగ్గురూ జైలుకు వెళ్లారు. దీంతో కొత్తగోరంట్ల నుంచి మకాం మార్చిన రామారావు, సాంబశివరావుల కుటుంబాలు పిడుగురాళ్ల సమీపంలోని పాతగణేశునిపాడులో నివాసం ఉంటుండగా, సుబ్బారావు కుటుంబం తాడికొండ మండలం రావెలలో నివాసం ఉంటున్నారు. అయితే తమ స్వగ్రామమైన కొత్తగోరంట్లలోని ఇళ్లు, పొలాలను వేరే వారికి అద్దెకు, కౌలుకు ఇచ్చారు.

ఈ క్రమంలో బెయిల్ పై విడుదలైన సుబ్బారావు, రామారావు ఈ నెల 7న  గ్రామానికి వచ్చి పొలం కౌలు గురించి మాట్లాడడాన్ని హతుడైన ధరణి నాగేశ్వరరావు భార్య వెంకటరత్నం గమనించింది. భర్తను హతమార్చిన నాటి నుంచి ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్న ఆమె, వారిని చూడగానే అప్రమత్తమైంది. బంధువులందర్నీ కూడగట్టింది. సుమారు 14 మంది కలిసి మోటారు సైకిళ్లపై గారపాడు రోడ్డు వద్ద సుబ్బారావును వెంబడించారు. వెంకటరత్నం తన వద్ద ఉన్న కత్తితో సుబ్బారావు మెడ నరకగా, మిగిలిన వారు కత్తులతో పొడిచి హతమార్చారు. ఈ క్రమంలో అతని సోదరుడు రామారావు తప్పించుకుని పారిపోయాడు. అతని కుటుంబం ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారని, పట్టుబడ్డవారిని కోర్టులో హాజరుపరచామని పోలీసులు తెలిపారు. 

More Telugu News