: జయలలిత కన్నకొడుకును నేను.. మా అమ్మను శశికళే చంపేసింది!: ఈరోడ్ కు చెందిన యువకుడి ఆరోపణ

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమార్తె అంటూ ఒక యువతి ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తానే జయలలిత కన్నకొడుకుని అంటూ ఈరోడ్ కు చెందిన కృష్ణమూర్తి అనే ఓ యువకుడు బయటకు వచ్చాడు. అంతేకాదు, తాను జయ కుమారుడినంటూ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశాడు. ఇంతకాలం తాను జయలలిత స్నేహితురాలు వనితామణి ఇంట్లో తన పెంపుడు తల్లిదండ్రులతో పాటు నివసించానని చెప్పాడు. 2016 సెప్టెంబర్ 14న తాను పొయస్ గార్డెన్ కు వెళ్లానని... ఆ సందర్భంగా నాలుగు రోజుల పాటు అమ్మతోనే ఉన్నానని లేఖలో పేర్కొన్నాడు.

తనను ప్రపంచానికి పరిచయం చేసేందుకు జయలలిత సిద్ధమయ్యారని... ఈ విషయం పసిగట్టిన శశికళ సెప్టెంబర్ 22వ తేదీన తన తల్లి జయతో గొడవ పడిందని కృష్ణమూర్తి తెలిపాడు. ఆ రాత్రి జయతో శశికళ గొడవ పెట్టుకుందని... వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని చెప్పాడు. ఆ తర్వాత తన తల్లిని శశికళ మెట్లపై నుంచి తోసేసిందని తెలిపాడు. తన తల్లిని చంపింది శశికళే అని అతను ఆరోపించాడు. ప్రాణ భయం కారణంగానే ఇన్ని రోజులు తాను ఈ విషయాన్ని బయటపెట్టలేదని... ఇప్పుడు నిజాన్ని ధైర్యంగా వెల్లడిస్తున్నానని చెప్పాడు. జయ ఆస్తులన్నింటికీ కూడా తానే అసలు సిసలు వారసుడినని తెలిపాడు.  

More Telugu News