: మరో ఘోరానికి మౌనసాక్షిగా నిలిచిన ఢిల్లీ.. అత్యాచార బాధితురాలి ఆర్తనాదాల్ని పట్టించుకోని ప్రజలు!

ఘోరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ అటువంటి ఘటనే చోటుచేసుకుంది. బాధితురాలు సాయం కోసం నడిరోడ్డుపై నగ్నంగా పరిగెడుతూ అర్థిస్తున్నా ప్రజలు తమకేమీ పట్టనట్టు తప్పించుకుని వెళ్లిపోవడం చూస్తుంటే, మనుషుల రక్తంలో మానవత్వం జాడలు లేవా? అన్న అనుమానం కలుగుతోంది . పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు కూడా ఎవరూ సాహసించకపోవడం గమనార్హం. విషయం తెలిసిన పోలీసులు తమంత తాముగా వచ్చే వరకు బాధిత మహిళ నిస్సహాయురాలిగా అక్కడే ఉండిపోయింది.  ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మునిర్కా ప్రాంతంలో నివసిస్తున్న ఓ మహిళ(26)కు ఇద్దరు పిల్లలు. పాండవనగర్‌లోని ప్లాట్ వద్ద పని ఉందని చెప్పి వికాశ్ అనే వ్యక్తి బాధితురాలిని కారులో అక్కడికి తీసుకెళ్లాడు. దారిలో అదే కారులో మరో ఇద్దరు స్నేహితులను ఎక్కించుకున్నాడు. ప్లాట్‌కు వెళ్లాక అక్కడ మరో ఇద్దరు జతకలిశారు. దీంతో బాధిత మహిళ భయంతో అభ్యంతరం తెలిపింది. ఆమె అభ్యంతరాన్ని ఏమాత్రం పట్టించుకోని వారు ఐదుగురు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి తెల్లవారుజామున 5.30 గంటల పాంత్రంలో వారి నుంచి తప్పించుకునే క్రమంలో బాధితురాలు బాల్కనీ నుంచి కిందికి దూకింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె తనపై దుండగులు అత్యాచారానికి  పాల్పడ్డారని, తనను రక్షించాలని దారినపోయే వారిని వేడుకుంది. అయినా ఎవరి మనసులు కరగలేదు. ఆమె ఆర్తానాదాలను ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోలేదు. చివరికి పోలీసులు వచ్చే వరకు ఆమె అక్కడే ఉంది. వారొచ్చి బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

More Telugu News