: కేసీఆర్ గారూ! ఇవిగో మీరు చెప్పిన అబద్ధాలు... రాజీనామా చేయండి!: రేవంత్ రెడ్డి సవాల్

తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్‌ నరసింహన్ ప్రసంగంలో అబద్ధాలు, అతిశయోక్తులు ఉన్నాయని నిరూపిస్తే ఐదు నిమిషాల్లో తన పదవికి రాజీనామా చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కేసీఆర్ అబద్ధాలు చెప్పారంటూ... గవర్నర్‌ ప్రసంగంతో పాటు, మూడేళ్ల ప్రసంగ కాపీలను కూడా మీడియాకు చూపించారు.

2014 నాటి గవర్నర్‌ ప్రసంగంలో అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ భూమిని కూడా ఇస్తానని ఆయన ప్రకటించారని గుర్తు చేసిన ఆయన అది ఇప్పటికీ అమలు చేయలేదని ఆరోపించారు. అలాగే తొలి, మలి తెలంగాణ ఉద్యమాల్లో 1569 మంది అమరులయ్యారని శాసనసభ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి అందులో కేవలం 500 కుటుంబాలకు మాత్రమే సహాయ సహకారాలు అందించారని అన్నారు. ఇతర అమర వీరుల కుటుంబాలను పట్టించుకోలేదని ఆయన చెప్పారు.

అలాగే 2014లో ఎస్సీల సమగ్రాభివృద్ధికి ఐదేళ్ల కాలంలో 50 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు కనీసం 3 వేల కోట్ల రూపాయలు కూడా కేటాయించలేదని తెలిపారు. ఇన్ని సాక్ష్యాలున్న తరువాత కూడా ఆయన ఇంకా పదవిలో కొనసాగేందుకు అర్హత లేదని, ఆయన ఇచ్చిన మాట ప్రకారమే తక్షణం రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 

More Telugu News