: ఆరు నెలల్లో రూ. 14.5 కోట్ల నుంచి రూ. 330 కోట్లకు పెరిగిన లోకేష్ సంపద: జాతీయ మీడియాలో కథనం

ఎమ్మెల్సీ ఎన్నికలలో నామినేషన్ వేసిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై జాతీయ మీడియా ఎన్డీటీవీ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. కేవలం ఆరు నెలల కాలంలోనే లోకేష్ సంపద విలువ రూ. 14.5 కోట్ల నుంచి రూ. 330 కోట్లకు ఎగబాకిందని తన కథనంలో పేర్కొంది. గత అక్టోబర్ లో లోకేష్ ప్రకటించిన ఆస్తుల వివరాల్లో తమ కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫ్రెష్ లో ని షేర్లు, కొన్ని స్థిరాస్తులు, రూ. 95 లక్షల విలువ చేసే ఓ కారును పేర్కొన్నారని తెలిపింది. తమ ఆస్తులను ప్రజలకు పారదర్శకంగా వెల్లడించాలనుకున్న క్రమంలోనే ఈ వివరాలను తెలుపుతున్నట్టు లోకేష్ చెప్పారని పేర్కొంది.

త్వరలోనే తన తండ్రి చంద్రబాబు కేబినెట్ లో లోకేష్ కొలువుతీరబోతున్నారని ఎన్డీటీవీ తెలిపింది. ఎమ్మెల్సీ నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో రూ. 330 కోట్ల సంపద ఉన్నట్టు లోకేష్ పేర్కొన్నారని ప్రచురించింది. ఇందులో షేర్ల రూపంలోనే రూ. 274 కోట్లు ఉందని చెప్పినట్టు తెలిపింది. అయితే తన ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా ప్రకటించినప్పుడు 'బుక్ వాల్యూ'ని పరిగణనలోకి తీసుకున్న లోకేష్... ఎన్నికల సంఘానికి ఇచ్చిన సమాచారంలో 'మార్కెట్ వాల్యూ'ని పరిగణనలోకి తీసుకున్నారని చెప్పింది. అయితే, ఊహించని విధంగా పెరిగిన లోకేష్ సంపద విలువను చూసి చాలా మంది ఆశ్చర్యానికి లోనయ్యారని ఓ అనలిస్ట్ చెప్పినట్టు పేర్కొంది. 

More Telugu News