: ఐక్యరాజ్యసమితి వేదికపై డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇవ్వనున్న రజనీకాంత్ కుమార్తె

సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ధనుష్ ఐక్యరాజ్యసమితి వేదికపై నృత్య ప్రదర్శనను ఇవ్వనున్నారు. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రదర్శించనున్నారు. ఈ నృత్య ప్రదర్శన స్త్రీ పురుష సమానత్వంపై ఉంటుందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ, ఐరాసలో ప్రదర్శన ఇచ్చే అవకాశం రావడం తనకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ఇప్పటికే ఆమె సినీ దర్శకురాలిగా, భరతనాట్య కళాకారిణిగా పేరు తెచ్చుకున్నారు. భారత్ లో 'స్త్రీ పురుష సమానత్వం, మహిళా సాధికారత'కు సంబంధించి ఐరాస ప్రచార కార్యకర్తగా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు.  

More Telugu News