: అంబికా కృష్ణకు టీడీపీ ఎమ్మెల్సీ టికెట్ రాకపోవడంపై వైశ్యుల నిరసన!

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీలో అలకల పర్వం మొదలయింది. ఈ క్రమంలో, ప్రముఖ వ్యాపారవేత్త అంబికా కృష్ణకు టీడీపీ ఎమ్మెల్సీ టికెట్ లభించకపోవడంతో వైశ్యులు నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ను అంబికా కృష్ణ ఆశించారు. కానీ, ఆయనకు నిరాశ ఎదురైంది.

ఈ క్రమంలో, ఆయన సామాజిక వర్గానికి చెందిన వైశ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారికి పాలాభిషేకం చేశారు. అంబికా కృష్ణకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని నినాదాలు చేశారు. పార్టీ కోసం అంబికా కృష్ణ ఎంతో కష్టపడ్డారని చెప్పారు. జిల్లాలో టీడీపీ ఘన విజయం సాధించడానికి వైశ్యులంతా పార్టీకి ఓటు వేయడమే కారణమని తెలిపారు.

ఈ సందర్భంగా అంబికా కృష్ణ మాట్లాడుతూ, తనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తానని గతంలోనే తమ నాయకుడు చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు కాకున్నా, రానున్న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు ఇస్తారన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. చంద్రబాబుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు.

More Telugu News