: 105 పరుగులకే కుప్పకూలిన భారత్... ఓకీఫే స్పిన్ కు దాసోహమన్న టీమిండియా బ్యాట్స్ మెన్

పూణేలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా అత్యంత దారుణమైన ప్రదర్శన చేసింది. కేవలం 105 పరుగులకే ఆలౌట్ అయి... అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. మన స్పిన్ బౌలింగ్ తో ఆసీస్ బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపిస్తారనుకుంటే... వారి స్పిన్ కు మన వాళ్లు బిక్కమొహం వేశారు. వరుసగా పెవిలియన్ చేరారు. టీమిండియా బ్యాట్స్ మెన్ లలో కేఎల్ రాహుల్ మాత్రమే 64 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్ మెన్లలో... విజయ్ 10, పుజారా 6, కోహ్లీ డకౌట్, రహానే 13, అశ్విన్ 1, సాహా డకౌట్, జడేజా 2, జయంత్ యాదవ్ 2, ఉమేష్ యాదవ్ 4 పరుగులు చేశారు. ఇషాంత్ శర్మ 2 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
 
ఆసీస్ బౌలర్లలో ఓకీఫే స్పిన్ కు మన బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. ఏడుగురు టీమిండియా బ్యాట్స్ మెన్ స్పిన్ బౌలింగ్ కు తడబడి, ఔట్ అయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఓకీఫే 6, స్టార్క్ 2 వికెట్లు తీయగా... లియోన్, హాజెల్ వుడ్ లు చెరో వికెట్ తీశారు.

ప్రస్తుతం ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. తొలి ఓవర్లోనే డేంజరస్ బ్యాట్స్ మెన్ వార్నర్ వికెట్ ను ఆస్ట్రేలియా కోల్పోయింది. అశ్విన్ వేసిన తొలి ఓవర్ తొలి ఐదు బంతుల్లో వార్నర్ 10 పరుగులు చేశాడు. ఆరో బంతికి ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. ప్రస్తుతం షాన్ మార్ష్ (0), స్మిత్ (5)లు క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా స్కోరు వికెట్ నష్టానికి 15 పరుగులు. దీంతో, రెండో ఇన్నింగ్స్ లో టీమిండియాపై ఆస్ట్రేలియా 170 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

More Telugu News