: భావన ఘటనతో నాకు ఎటువంటి సంబంధం లేదు: నిర్మాత ఆంటో జోసెఫ్

సినీ నటి భావనపై జరిగిన వేధింపులకు, తనకు ఎలాంటి సంబంధం లేదని మలయాళ నిర్మాత ఆంటో జోసెఫ్ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సునీల్ (పల్సర్ సునీ) కి ఆంటో జోసెఫ్ తో సంబంధాలు ఉన్నాయని, అందుకే ఘటన జరిగిన వెంటనే అతని ఫోన్ నుంచి సునీకి కాల్స్ వెళ్లాయని మలయాళ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. దీంతో ఆయనే బయటకు వచ్చి స్పందించారు. నిందితులకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఘటన జరిగిన తరువాత దర్శకుడు లాల్‌ తనకు ఫోన్‌ చేశాడని, అయితే తన ఫోన్‌ సైలెంట్‌ మోడ్‌ లో ఉండటంతో దానిని తాను అటెంప్ట్ చేయలేదని చెప్పాడు.

ఆ తరువాత రెంజీ పనిక్కర్‌ ఫోన్‌ చేసి, జరిగిన దారుణం గురించి వివరించారని, వీలైనంత తొందరగా లాల్ ఇంటికి రావాలని పిలిపించారని తెలిపారు. దీంతో తాను ఎమ్మెల్యే పీటీ థామస్ తో పాటు లాల్ ఇంటికి వెళ్లానని, అప్పటికే పోలీసులు, భావన డ్రైవర్ మార్టిన్ అక్కడ ఉన్నారని చెప్పారు. దీంతో తాను మార్టిన్ ను అడిగి, పల్సర్ సుని నెంబర్ తీసుకుని డయల్ చేశానని చెప్పారు. తొలుత తన కాల్ ను సుని లిఫ్ట్ చేయలేదని, తరువాత కాల్ బ్యాక్ చేసి, నువ్వెవరని అడిగాడని, తాను నిర్మాతనని, తన పేరు ఆంటో జోసెఫ్ అని చెప్పడంతో ఫోన్ పెట్టేశాడని తెలిపారు. అంతకు మించి అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఇలాంటి ఘటన ఏ అమ్మాయికీ జరగకూడదని ఆయన తెలిపారు. కాగా, లైంగిక వేధింపుల అనంతరం భావన లాల్ దగ్గరకి వెళ్లిన సంగతి తెలిసిందే.

More Telugu News