: ఆధ్యాత్మికత ఉన్న చోట నా పాట ఉండాలని కోరుకుంటా: సింగర్ సునీత

ఎక్కడ ఆధ్యాత్మికత ఉంటుందో, అక్కడ తన పాట ఉండాలని కోరుకుంటానని ప్రముఖ గాయని సునీత పేర్కొన్నారు. తిరుపతిలో లేపాక్షి హ్యాండ్లూమ్ ఎక్స్ పో ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తిరుపతిలో లేపాక్షి హ్యాండ్లూమ్ ఎక్స్ పో ప్రారంభోత్సవానికి గత ఆరేళ్లుగా తాను వస్తున్నానని, ఆ తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయతీ అయిపోయిందని చెప్పారు. స్వామి దర్శనం బాగా జరిగిందని, ఆయన కరుణ తనపై ఉందని, మళ్లీ మళ్లీ శ్రీవారిని దర్శించుకునేందుకు ఆయన అనుగ్రహం తనపై ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.

తాను పాడిన రెండు, మూడు ఆల్బమ్స్ త్వరలోనే విడుదల కానున్నాయని, అదేవిధంగా దర్శకులు తేజ, నందినిరెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమాలు, కమలాకర్ సంగీత దర్శకత్వంలో వస్తున్న మరో సినిమాలో తాను పాటలు పాడానని సునీత చెప్పారు. నాలుగేళ్ల క్రితం వెంగమాంబపై ఆల్బమ్స్ రూపొందించామని, అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, టీడీడీ వారికే కాకుండా విడిగా కూడా స్వామి వారిపై పాటలు పాడానని, ఆ పాటలన్నీ బయటకు వస్తున్నాయని, ఎక్కడ ఆధ్యాత్మిక ఉందో, అక్కడ తన పాట ఉండాలని కోరుకుంటానని, దేవుడి దయ వల్ల తన కెరీర్ బాగుందని నవ్వుతూ సునీత చెప్పారు.

More Telugu News