: అసెంబ్లీలో మరోసారి రెచ్చిపోయిన డీఎంకే ఎమ్మెల్యేలు.. మధ్యాహ్నం 3గం. వరకు వాయిదా
తమిళనాడు శాసనసభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన స్పీకర్ ధన్పాల్ సభను మరోసారి వాయిదా వేశారు. డీఎంకే సభ్యులను సభ నుంచి బహిష్కరించిన తరువాత వారంతా స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చి విధ్వంసం సృష్టిస్తామన్నట్లు వ్యవహరించారు. మరోసారి కొందరు డీఎంకే ఎమ్మెల్యేలు శాసనసభలో బెంచీలు ఎక్కి మరీ నిరసన తెలిపారు. పరిస్థితులు సద్దుమణగని కారణంగానే ధన్పాల్ సభను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొదట డివిజన్ ఓటింగ్ కొనసాగిస్తామని స్పీకర్ అన్నారు. అయితే, ఓటింగ్ సాగే పరిస్థితులు పూర్తిగా లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రహస్య ఓటింగ్ జరపాల్సిందేనని డీఎంకే ఎమ్మెల్యేలు నినాదాలతో హోరెత్తించారు.