: రెండేళ్ల తర్వాత యూపీలోకి ‘గబ్బర్‌ సింగ్‌’ వచ్చారు!: మోదీపై రాహుల్ గాంధీ చురకలు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రాయ్‌బరేలీలో నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ త‌న సోద‌రి ప్రియాంక గాంధీతో క‌లిసి పాల్గొని మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ ప్రధాని నరేంద్రమోదీపై మండిప‌డ్డారు. మోదీని షోలే సినిమాలోని 'గబ్బర్‌ సింగ్‌'తో పోల్చారు. రెండేళ్ల తర్వాత ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోకి గబ్బర్‌ సింగ్‌ వచ్చారని ఆయ‌న అన్నారు. ఆయన బెనారస్‌ వెళ్లి తాను గంగా పుత్రుడిని అని చెప్పుకున్నారని, ఇప్పుడు వారణాసి దత్తపుత్రుడినని అంటున్నారని రాహుల్ గాంధీ అన్నారు.  

మోదీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఇప్ప‌టికీ అచ్చేదిన్ (మంచి రోజులు) రాలేద‌ని రాహుల్ గాంధీ అన్నారు. రైతుల‌కు రుణాలు మాఫీ కూడా చేయడం లేద‌ని, మ‌రోవైపు వ్యాపార‌వేత్త విజ‌య్‌ మల్యా లాంటి వారు రూ.9 వేల కోట్లతో దేశం విడిచి జారుకునేలా చేశారని ఆయ‌న వ్యాఖ్యానించారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణ‌యంతో కేవ‌లం పేదవాడు మాత్రమే బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలో నిల్చున్నార‌ని ఆయ‌న అన్నారు. ఒక్క ధనికుడికైనా క‌ష్టాలు వ‌చ్చాయా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. మోదీ హామీలు ఇవ్వ‌డ‌మే తప్పా చేసేది ఏమీ ఉండదని ఆయ‌న విమ‌ర్శించారు. మోదీని చూసి భయపడుతున్న మీడియా ఆయ‌న ప్ర‌చారం చేస్తోన్న అస‌త్యాల‌ను ప్ర‌జ‌ల‌కు తెల‌ప‌డం లేద‌ని ఆయ‌న అన్నారు.

More Telugu News