: తమిళనాట మరో సంచలనం....శశికళ, దినకరన్, వెంకటేషన్ లను పార్టీ ప్రాధమిక సభ్యత్వం నుంచి తొలగించిన పన్నీర్ వర్గం!

తమిళనాట మరో సంచలనానికి తెరలేచింది. పన్నీర్ సెల్వం కొత్త వ్యూహంతో పళనిస్వామి శిబిరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. గత 14 రోజులుగా పలు మలుపులు తిరుగుతున్న రాజకీయాలు నిన్న పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేపట్టడంతో చల్లబడ్డాయని అంతా భావించారు. అయితే, అందరి అంచనాలను వమ్ము చేస్తూ అసలు పోరాటం ఇప్పుడే ప్రారంభమైందని జయలలిత సమాధి సాక్షిగా శపధం చేసిన పన్నీర్ సెల్వం...ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ప్రజల్లో ఆయనకు ఉన్న ఇమేజ్ తో అది వైరల్ గా మారింది. దానికి కొత్త రూపునిస్తూ జల్లికట్టు తరహా ఉద్యమానికి సిద్ధం కావాలంటూ యువత సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించింది.

ఊహించని ఈ పరిణామంతో, శశికళ దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నాన్ని పళని స్వామి రద్దు చేసుకున్నారు. అనంతరం జయలలిత సొంత నియోజకవర్గంగా భావించే ఆర్కే నగర్ నుంచి దినకరన్ బరిలో దిగుతున్నారని ప్రకటించారు. దీనిపై ఆగ్రహించిన పన్నీర్ సెల్వం అసలైన అన్నాడీఎంకే పార్టీ తమదేనని ప్రకటించారు. జయలలిత వ్యతిరేకించిన వారు ఉన్న పార్టీ అసలైన అన్నాడీఎంకే కాదని ప్రకటించారు. అంతే కాకుండా ప్రిసీడియం ఛైర్మన్ మధుసూధనన్ తో ఎవరూ ఊహించని ప్రకటన ఇప్పించారు. అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ, దినకరన్, వెంకటేషన్ లను తొలగిస్తున్నామని, వారి పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించారు. దీంతో పళనిస్వామి వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి.

More Telugu News