: చైనా ఆగ్రహాన్ని చల్లార్చే పనిలో భారత్!

తైవాన్ విషయంలో భారత్ అధికంగా కల్పించుకుంటోందన్న ఆగ్రహంతో చైనా ఘాటు విమర్శలు గుప్పించిన వేళ, ఆ కోపాన్ని చల్లబరిచేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. చైనా ఆరోపించినట్టు తైవాన్ ప్రజా ప్రతినిధుల భారత పర్యటన వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కొంతమంది తైవాన్ విద్యావేత్తలు, వ్యాపారులు, మరికొందరు ప్రజా ప్రతినిధులు ఇండియా సందర్శనకు వస్తున్నారని, ఇలా రావడం వ్యాపార సంబంధాల విస్తరణతో పాటు పర్యాటక అవసరాలుంటాయని ఆయన అన్నారు. వీరు చైనాలో కూడా పర్యటించే ఉంటారని, ఈ తరహా సందర్శనలు, వారితో చర్చల వెనుక రాజకీయ కోణాలు ఉండవని అన్నారు.

కాగా, తైవాన్ డెలిగేషన్ టీముకు భారత్ ఆహ్వానం పలకడం తాము అవలంబిస్తున్న 'వన్ చైనా పాలసీ'కి వ్యతిరేకమని చైనా నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు సైతం తమ విధానాల్లో తలపెట్టడం లేదని, తైవాన్ విషయంలో ముందు చూపుతో వ్యవహరించాలని చెబుతూ హెచ్చరికలను కూడా జారీ చేసింది. కాగా, మూడు రోజుల పర్యటనకు రానున్న తైవాన్ బృందంలో ముగ్గురు పార్లమెంట్ మహిళా సభ్యులు, ప్రొఫెసర్లు, వ్యాపారులు, కంప్యూటర్ రంగానికి చెందిన వారు ఉన్నారు.

More Telugu News