: ప్రేమికుల రోజున దేశరాజధానిలో వెలుగు చూసిన దారుణం

ప్రేమికుల దినోత్సవం రోజున దేశరాజధానిలో దారుణం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే...జార్ఖాండ్ లోని రాంచీకి చెందిన సుబోధ్ కుమార్ (40) ఢిల్లీలోని చాదర్ విహార్ ప్రాంతంలో భార్య మనీషా (34) తో కలిసి ఉంటున్నాడు. వారికి ఇద్దరు ఆడపిల్లలు. కార్పెంటర్ గా పనిచేసే సుబోధ్ గత కొంత కాలంగా మద్యం, డ్రగ్స్ కు బానిసగా మారాడు. దీంతో భార్యాభర్తల మధ్య నిత్యం వివాదం రాజుకునేది. దీనికి తోడు సొంత ఊరు రాంచీకి చెందిన మునియా (25) ను భార్యకు తెలియకుండా వివాహం చేసుకోవడంతో అది ఈ మధ్యే వెలుగుచూసింది. దీంతో తనకు విడాకులివ్వాలంటూ మనీషా డిమాండ్ చేసేది.

దీనిని తట్టుకోలేకపోయిన సుబోధ్ కుమార్ మూడు రోజుల క్రితం భార్యను హత్య చేసి, మెడను రంపంతో కోసి మొండెం నుంచి వేరు చేశాడు. అయితే, ఆమె శవాన్ని ఎలాగోలా తరలించాలన్న సుబోధ్ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో గుట్టురట్టువుతుందని భావించిన సుబోధ్...ఆమె శరీర భాగాలను ఇంట్లోనే ఉంచాడు. మూడు రోజులు కావడంతో ప్రేమికుల రోజున వారి ఇంట్లోంచి కంపు కొడుతుండడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వచ్చి చూసిన పోలీసులు నిర్ఘాంతపోయారు. అనంతరం అతనిని అదుపులోకి తీసుకున్నారు. వారి పిల్లలు మనీషా పుట్టింట్లో ఉండడంతో వారికి ఈ విషయం తెలియలేదు. కాగా, దీని వెనుక మునియా హస్తం ఉందేమోనన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

More Telugu News