: తొలుత ఎమ్మెల్యేల తరలింపా... శశికళ అరెస్టా?... మీమాంసలో పోలీసులు

కువత్తూరులోని గోల్డెన్ బే రిసార్టుకు చేరుకున్న పోలీసు అధికారులు, తొలుత ఎమ్మెల్యేలను తరలించాలా? లేక శశికళను అరెస్ట్ చేయాలా? అన్న మీమాంసలో ఉన్నారు. అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు శశికళకు శిక్షను ఖరారు చేసిన తరువాత రిసార్టు వద్దకు వచ్చిన పోలీసు అధికారుల్లో కొందరు ఇప్పటికే అన్నాడీఎంకే నేతలతో చర్చించారు. తొలుత ఎమ్మెల్యేలను వారంతట వారుగా రిసార్టును వదిలి వెళ్లేందుకు అవకాశం ఇస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి. వారు అక్కడే ఉన్న సమయంలో శశికళను అరెస్ట్ చేస్తే, ప్రతిఘటన ఎదురు కావచ్చని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. శశికళ తనంతట తానుగా లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం అందడంతో, అందుకోసం వేచి చూస్తున్నామని, ఆమెను తరలించే వేళ, ఒక్క అన్నాడీఎంకే కార్యకర్త లేదా ఎమ్మెల్యే పోలీస్ కాన్వాయ్ మధ్య లేకుండా చూస్తామని ఓ పోలీసు అధికారి ప్రకటించారు. మరికాసేపట్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. 

More Telugu News