: జ్యోతికతో కలిసి సూర్య విసిరిన దోసె ఛాలెంజ్ కు అంజలితో బదులిచ్చిన జై!

ప్రముఖ నటుడు సూర్య తన భార్య జ్యోతిక (జ్యో) తో విసిరిన దోసె చాలెంజ్ ను స్వీకరించినట్టు మరోనటుడు జై తెలిపాడు. తమిళంలో జ్యో నటించిన 'మగళిర్ ముట్టుమ్' సినిమా టీజర్ విడుదలైంది. అందులో 'ఇంట్లో అందరి కోసం లెక్కకు మించి దోసెలు వేసే అమ్మ, శ్రీమతి కోసం ఎవరైనా ఒక్క దోసె వేశారా?' అంటూ నిలదీశారు. దీంతో వంటగదిలో దూరిన సూర్య తన భార్య జ్యోతిక కోసం దోసె వేసి దాని ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ...పలువుర్ని ట్యాగ్ చేసి ‘దోసె ఛాలెంజ్‌’ విసిరాడు. దీంతో పలువురు సినీ నటులు వంటగాళ్లుగా మారిపోయి వంటగదిలో దోసెలు వేశారు. ఆ ఫోటోలు పోస్టు చేశారు.

ఇందులో తమిళ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్న ఫోటో ఏదంటే, తమిళ నటుడు జై, నటి అంజలితో కలిసి ఉన్న ఫోటో. 'జర్నీ' సినిమాలో జైతో కలిసి అంజలి నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రత్యేక బంధం ఏర్పడిందన్నది కోలీవుడ్ మాట. అయితే తామిద్దరం మంచి స్నేహితులమని వారిద్దరూ చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో జై పెట్టిన ఫోటోను చూస్తూ అభిమానులు...సూర్య అమ్మ లేదా శ్రీమతి కోసం వంటవాళ్లుగా మారమన్నాడని, అంజలి, జైకి తల్లి కాదు కనుక ఈ ఫోటోతో ఇంకేదైనా బంధం ఉందని చెబుతున్నాడా? అంటూ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News