: ఆంక్షలు విధించవచ్చని పసిగట్టి ఉగ్రసంస్థ పేరు మార్చేసిన హఫీజ్ సయీద్

ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్-ఉల్-దవా (జేయూడి) ఉగ్రసంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌ను పాకిస్థాన్ ఇటీవ‌లే హౌస్ అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే, త‌నపై చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని ముందుగానే ప‌సిగ‌ట్టిన హ‌ఫీజ్ స‌యీద్ త‌మ ఉగ్ర‌సంస్థ కార్యకలాపాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ‘తెహ్రీక్ ఆజాదీ జమ్ముకశ్మీర్ (టీఏజేకే)’ అని కొత్త పేరుతో మళ్లీ కుట్రలు ప్రారంభించినట్టు అధికార వ‌ర్గాలు చెప్పాయి.
 
జ‌మాత్‌ ఉద్‌ దవాతో పాటు ఫలా ఎ ఇన్సానియత్‌ ఫౌండేషన్‌ల కార్యకలాపాలపై అక్క‌డి స‌ర్కారు నిఘా పెట్టడంతో ఇప్పుడు ఆ రెండు సంస్థల కార్యక్రమాలన్నింటినీ ఈ కొత్త సంస్థ పేరు మీద నిర్వ‌హించేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నాడ‌ని తెలిపింది. వేర్పాటువాదులు ఫిబ్రవరి 5న పాకిస్థాన్‌లో కాశ్మీర్‌ డే ను నిర్వ‌హిస్తారు. అందుకు సంబంధించిన ప‌లు బ్యానర్లు తెహ్రీక్‌ ఎ ఆజాదీ జమ్ము కశ్మీర్‌ పేరుతో లాహోర్ ప‌రిస‌రాల్లో కనిపించాయి. అంతేకాదు, రేపు ఈ సంస్థ అక్క‌డ భారీ ఎత్తున స‌మావేశం నిర్వ‌హించాల‌ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. కొత్త‌గా స్థాపించిన‌ టీఏజేకే స‌మ‌క్షంలో విరాళాల సేకరణ, అంబులెన్స్‌ సేవల పునరుద్ధరణ వంటి కార్య‌క్ర‌మాలు ఇప్పటికే జరిగాయి.

సయీద్‌ నెట్‌వర్క్‌కి చెందిన కార్య‌క‌ర్త‌లు ఇటీవ‌లే రావి నదిలో పడవ మునిగిన ఘటనలో బాధితుల‌ని ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నించార‌ని, 100 మంది ప్రయాణికులను రక్షించారని అక్క‌డి ప‌త్రిక‌లు పేర్కొన్నాయి.

More Telugu News