: అన్నింటికీ ఓకే అన్నాడు... ఇప్పుడు మాయమయ్యాడు.. ప్రేమలో మోసపోయిన మరో యువతి!

ప్రేమించానన్నాడు.. నువ్వు లేనిదే నేను లేనన్నాడు.. సహజీవనం కూడా చేశాడు. పెళ్లికి అంగీకరించినట్టే అంగీకరించి ఇప్పుడు ప్రియుడు మాయమవడంతో బాధితురాలు తుకారాంగేట్ పోలీసులను ఆశ్రయించిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌ లోని అడ్డగుట్టకు చెందిన ఓ యువతి పదేళ్లపాటు గుంటూరులో చదువుకుంది. అక్కడ ఆమెకు పాపయ్య అలియాస్‌ డేవిడ్‌ పరిచయమయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు.

గత కొంత కాలంగా ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇక వివాహం చేయడమే ఆలస్యమని భావించిన యువతి తల్లిదండ్రులు మూడు లక్షల రూపాయల నగదు, ఐదుతులాల బంగారం ఇస్తామని, త్వరలోనే వివాహ ముహూర్తం ఖరారు చేసుకుందామని డేవిడ్ కు చెప్పారు. దీనికి అంగీకరించిన డేవిడ్, ఆ తర్వాత పది రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. అతని కోసం ఎదురు చూస్తున్న యువతి సెల్ ఫోన్ కు 'నిన్ను పెళ్లి చేసుకోను.. నన్ను మర్చిపో' అంటూ ఎస్‌ఎంఎస్‌ పెట్టాడు. దీంతో బెంబేలెత్తిపోయిన యువతి అతని సెల్ కు ఫోన్ చేయగా, స్విచ్ఛాఫైంది. దీంతో ఆమె తుకారాం గేట్ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News