: టెక్కీలకు పెను కష్టాలు... హెచ్1-బీ వీసాలపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సిద్ధం!

డొనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పనీ చేసేలా ఉన్నారు. భారత టెక్నాలజీ కంపెనీలు అత్యధికంగా వాడుతున్న హెచ్1-బీ వీసాలను గణనీయంగా తగ్గించడంతో పాటు, కఠిన నిబంధనలు విధిస్తూ, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తయారైనట్టు తెలుస్తోంది. దీనిపై ట్రంప్ నేడో రేపో సంతకాలు పెట్టనున్నారన్న వార్త భారత టెక్కీల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రతి యేటా అమెరికా 85 వేల హెచ్1-బీ వీసాలను ఇస్తుండగా, ఇందులో సింహభాగాన్ని అంటే, దాదాపు 80 శాతానికి పైగా వీసాలు భారత్ కే దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తన కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేస్తే, భారత కంపెనీలకు పెనునష్టమే. వీసాల విధానంలో సంస్కరణలు తెస్తూ తయారైన ముసాయిదా సిద్ధమైందని ట్రంప్ అధికార ప్రతినిధి సీన్ స్పిసర్ వెల్లడించారు. దేశ వీసా విధానాన్ని, ఇమిగ్రేషన్ పాలసీలను సమూలంగా మార్చి అమెరికన్లకు మేలును కలిగించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు.

More Telugu News