: రొట్టెల పిండిని కొంచెం పడేసిందని కూతురుకి నిప్పు పెట్టిన అమ్మ!

ప్రపంచంలో అన్నింటికన్నా గొప్పది అమ్మ. ఇంకా చెప్పాలంటే దైవంతో సమానమైన స్థానం ఆమెది. తన ప్రాణాలనే పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుందామె. అంతటి ఉన్నతమైన స్థానంలో ఉన్న అమ్మ స్థాయికే మచ్చి తెచ్చిందో తల్లి. వివరాల్లోకి వెళితే, ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం చింతగూడలో జరిగింది. దొబ్బ చెన్నయ్య, స్వరూప దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.

నిన్న రాత్రి రొట్టెలు చేయడానికి కిరాణా కొట్టు నుంచి పిండి తీసుకురమ్మని రాధిక (10)ను పంపింది స్వరూప. ఆ చిన్నారి పిండి తీసుకు వస్తుండగా... కొంచెం ఒలికిపోయింది. దీంతో, స్వరూప ఆగ్రహానికి లోనై, రాధికను చితకబాదింది. అంతేకాదు, ఇంట్లో ఉన్న కిరోసిన్ ను కూతురుపై పోసి నిప్పు పెట్టింది. దీనిని గమనించిన పొరుగువారు మంటలను ఆర్పి, 108 అంబులెన్స్ లో రాధికను షాద్ నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో... అక్కడి నుంచి హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

More Telugu News