: ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో భారీగా పట్టుబడ్డ నగదు!

వచ్చే నెల 4 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఈరోజు వరకు భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. ఎన్నికల కమిషన్ నిఘా వర్గాలకు పట్టుబడ్డ ఈ నగదును అధికారులు సీజ్ చేశారు. యూపీ నుంచి అత్యధికంగా రూ.71.32 కోట్లు, పంజాబ్ లో రూ.8.81 కోట్లు, ఉత్తరాఖండ్ లో రూ.25.24 లక్షలు, మణిపూర్ లో 6.95 లక్షలు పట్టుబడినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

అలాగే, 3 లక్షల లీటర్ల మద్యం, రూ.6.55 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను సీజ్ చేసినట్లు తెలిపారు. నగదు భారీగా పట్టుబడ్డ రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్ లు అగ్రస్థానంలో నిలిచాయి. మాదక ద్రవ్యాలను అక్రమంగా సరఫరా చేయడంలో మాత్రం పంజాబ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ ఒక్క రాష్ట్రంలోనే ఇప్పటి వరకు రూ.5.54 కోట్ల మేరకు మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. యూపీ, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ లో వరుసగా రూ. 68.14 లక్షలు, రూ.16.72 లక్షలు, రూ.9.66 లక్షలు, రూ.7 లక్షల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.  

More Telugu News