: దిగి వస్తున్న పాక్.. దిక్కులేని స్థితిలో బాలీవుడ్ సినిమాలపై నిషేధం ఎత్తివేత!

ఉరీ ఉగ్రదాడి తర్వాత పాక్ సినీ నటులపై బాలీవుడ్ నిషేధం విధించింది. ఈ నిర్ణయంపై పాక్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించి, ఆ దేశంలో బాలీవుడ్ సినిమాలపై నిషేధం విధించింది. ఈ నిర్ణయంతో అక్కడి సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి. వాస్తవానికి పాక్ థియేటర్లకు 70 శాతం ఆదాయం బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల ద్వారానే వస్తుంది. దీంతో, థియేటర్ యాజమాన్యాల అభిప్రాయాలను కనుక్కునేందుకు నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఇటీవల ఓ కమిటీని వేసింది. సమాచార మంత్రి మర్యూమ్ ఔరంగజేబ్ ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రధాని సలహాదారు కూడా సభ్యుడిగా ఉన్నారు.

కమిటీ సూచనల ప్రకారం బాలీవుడ్ సినిమాలపై నిషేధం ఎత్తివేయనున్నారు. అయితే, ఇంతకు ముందులా కాకుండా నెలకు కేవలం రెండు లేదా మూడు భారతీయ సినిమాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. భారతీయ సినిమాలను పాక్ లో ఆడించాలంటే, సమాచార శాఖ ద్వారా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసీ) తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నెలకు రెండు లేదా మూడు భారతీయ సినిమాలకు మాత్రమే ఎన్ఓసీ ఇవ్వాలని సమాచార శాఖ నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో, కరాచీలోని ఆట్రియమ్ థియేటర్ నదీమ్ మాట్లాడుతూ, తమ రెవెన్యూలో 70 శాతం బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల ద్వారానే వస్తుందని... బాలీవుడ్ సినిమాలపై నిషేధం మరికొంత కాలం కొనసాగితే థియేటర్లు మూసుకోవడం మినహా తమకు మరో దారి లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 

More Telugu News