: 39 మందిని చంపిన నరహంతక ఉగ్రవాది పట్టివేత!

నూతన సంవత్సరం వచ్చిందన్న ఆనందంలో ప్రజలు వేడుకలు జరుపుకుంటున్న వేళ, ఇస్తాంబుల్‌ లోని ఓ నైట్‌ క్లబ్‌ పై ఉగ్రదాడి చేసి, విచక్షణారహితంగా కాల్పులు జరిపి, 39 మందిని కిరాతకంగా హతమార్చిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని టర్కీ మీడియా నేడు పేర్కొంది. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు చేపట్టిన పోలీసుల స్పెషల్‌ ఆపరేషన్‌ లో భాగంగా, ఎసెన్‌ యర్ట్‌ ప్రాంతంలో ఉగ్రవాదిని అరెస్ట్ చేశామని, అతను ఉజ్బెకిస్థాన్ కు చెందిన అబ్దుల్ కదిర్ మషరిపోవ్ గా గుర్తించామని పేర్కొంది.

ఇతనితో పాటు ఉన్న కిర్గిస్థాన్ కు చెందిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. వీరికి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం విచారణ నిమిత్తం పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు తరలించినట్టు తెలుస్తోంది. కాగా, నరమేధం తరువాత, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగాన్ని టర్కీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సుమన్ కుర్టుల్మస్, విదేశాంగ మంత్రి మెవ్లుట్ కవుసోగ్లు అభినందిస్తూ, ట్వీట్లు చేశారు.

More Telugu News