: దేవుడి కోసం భక్తులు ఎదురు చూస్తున్నట్టు చిరంజీవి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు!: పరుచూరి సోదరులు

1978లో తాము, చిరంజీవిగారు ఒకేసారి సినీ రంగప్రవేశం చేశామని ప్రముఖ మాటల రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు తెలిపారు. హాయ్ ల్యాండ్ లో ఖైదీ నెంబర్ 150వ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ, ఖైదీ సినిమాకు తాము మాటలు రాశామని, ఆ సినిమా చిరుతోపాటు తమకు కూడా బ్రేక్ ఇచ్చిందని అన్నారు. చిరంజీవి సినిమాల్లో మూడో వంతు సినిమాలకు మాటలు తామే రాశామని అన్నారు. తమలాగే చిరంజీవి కూడా స్వశక్తితో పైకి ఎదిగాడని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ఇంద్ర సినిమాలో డైలాగ్ చెప్పిన పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, దేవుడికోసం భక్తుడు ఎదురు చూసినట్టు ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారని అన్నారు. మెగాస్టార్ ఇంతింతై వటుడింతై అన్నట్టు ఆయన ఆకాశమంత ఎత్తు ఎదిగాడని అన్నారు. మెగాస్టార్ అనే చెట్టుకి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, నిహారిక అనే కొమ్మలు వచ్చాయని అన్నారు. ఈ కొమ్మలన్నీ తమ వారసత్వాన్ని కాపాడుతున్నాయని ఆయన తెలిపారు. సంక్రాంతి పండగ అప్పుడే వచ్చేసిందా? అన్నట్టు ఇక్కడి కోలాహలం ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి సినిమాల్లోని పలు పంచ్ డైలాగులను ఆయన చెప్పారు.

More Telugu News