: కన్నకొడుకుపై కత్తితో దాడిచేసి పారిపోయిన మహిళ!

కొడుకుకి చిన్న దెబ్బ తగిలితేనే తల్లి హృదయం త‌ల్లడిల్లిపోతుంది.. అల్లారు ముద్దుగా, కంటికి రెప్ప‌లా త‌న బిడ్డ‌ల‌ను పెంచుకుంటుంది. అయితే, మ‌హారాష్ట్ర‌లోని థానేలో మాత్రం ఓ తల్లి త‌న క‌న్న కొడుకుపై కత్తితో దాడి చేసింది. ఏడేళ్లు కూడా నిండ‌ని ప‌సివాడిని క‌త్తితో గాయ‌ప‌రిచింది. ప్ర‌స్తుతం ఆ చిన్నారి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. సదరు తల్లి రేష్మాపై కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై వివ‌రాలు తెలిపారు. ఆ బాలుడి తండ్రి ఆకాష్ కుంభర్ పెయింటర్ గా ప‌నిచేస్తున్నాడని వారు తెలిపారు. అయితే, రెండు నెలలుగా అతడికి పని దొర‌క‌క‌పోవ‌డంతో ఇంట్లోనే ఉంటున్నాడని చెప్పారు.

దీంతో అత‌డితో రేష్మా గొడవ పడేదని పోలీసులు తెలిపారు. రేష్మా పుట్టింవారిని చూడ‌డానికి కోల్‌కతా వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. తాజాగా ఉద్యోగం విష‌యంలో భర్తతో గొడ‌వ‌కు దిగిన రేష్మా చేతిలో క‌త్తి ప‌ట్టుకొని తండ్రీకొడుకులను ఇంట్లోంచి వెళ్లిపొమ్మని బెదిరించిందని పోలీసులు అన్నారు. ఈ క్ర‌మంలోనే పిల్లవాడిని కత్తితో గాయ‌ప‌రిచింది. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావం అయిందని చెప్పారు. ఆ మ‌హిళ‌పై 326 (ఆయుధాల వాడకం), 504 (ఉద్దేశ పూర్వకంగా దాడి చేయడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొన్నామ‌ని, అయితే, రేష్మా ఘ‌ట‌న జ‌రిగిన త‌రువాత‌ ఇంట్లోనుంచి పారిపోయింద‌ని పోలీసులు తెలిపారు.

More Telugu News