: తప్పుడు పత్రాలతో సిమ్‌కార్డు తీసుకున్నా, విక్రయించినా ఇకపై నేరుగా జైలుకే!

త‌ప్పుడు ప‌త్రాలు స‌మ‌ర్పించి సిమ్ కార్డులు పొందుతున్న వారితో పాటు విక్ర‌యిస్తున్న వారిపై కేంద్ర హోంశాఖ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇక‌పై ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే నిందితుల‌ను జైలుకు పంపించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. అంతేగాక‌, సిమ్‌ను యాక్టివేట్ చేసే కస్టమర్ కేర్ సెంటర్‌ ప్రతినిధులపై కూడా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపింది. న‌కిలీ ప‌త్రాలు స‌మ‌ర్పించి ఉగ్రవాదులు, నేరగాళ్లు విరివిగా సిమ్‌కార్డులను ఉప‌యోగిస్తున్నార‌ని చెప్పింది. క‌స్ట‌మ‌ర్లు సిమ్‌కార్డు తీసుకోగానే వెంటనే యాక్టివేట్ అయ్యే వీలున్న (ప్రీ యాక్టివేటెడ్‌) కార్డులు కూడా పెరిగిపోతుండ‌డంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం శాఖ పేర్కొంది. ఈ మేర‌కు దేశంలోని అన్ని రాష్ట్రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. హైదరాబాద్‌, ముంబయి, డిల్లీ, చెన్నై నగరాల్లో వేల సంఖ్యలో ప్రీ యాక్టివేటెడ్‌ సిమ్‌కార్డులు ఉన్నాయని త‌మ దృష్టికి వ‌చ్చిన‌ట్లు తెలిపింది.

ఇక‌పై సిమ్‌కార్డు కోసం క‌స్ట‌మ‌ర్లు స‌మ‌ర్పించే పత్రాలతో పాటు ఓ ప్రమాణ పత్రం కూడా తీసుకోవాల‌ని సిమ్ కార్డులు ఇచ్చే కేంద్రాల‌కు ఆదేశాలు జారీ చేసింది. సిమ్‌కార్డు దరఖాస్తు తీసుకున్నాక విక్రేత సమక్షంలోనే సంతకం పెట్టి, దరఖాస్తులో అతికించిన ఫొటో, దరఖాస్తుదారుడిని పోల్చుకున్నాకే విక్రేత క‌స్ట‌మ‌ర్ల‌కు సిమ్‌కార్డును అందించాలి. అనంత‌రం క‌స్ట‌మ‌ర్ కేర్ ప్రతినిధి ఆ దరఖాస్తుదారు వివరాలన్నీ మరోమారు స‌మ‌గ్రంగా పరిశీలించి, ఏమ‌యినా అనుమానాలు వస్తే సిమ్‌కార్డును యాక్టివ్ చేయ‌కుండా ఉండ‌డంతో పాటు త‌ప్పుడు వివ‌రాలు స‌మ‌ర్పించినందుకు గానూ ఈ విషయాన్ని ఆ ప్రతినిధి పోలీసుల దృష్టికి గానీ, టెర్మ్ కు గానీ చెప్పాలి. ఒకవేళ ఆ ప్ర‌తినిధులు ఈ ఆదేశాలు పాటించ‌క‌పోతే పోలీసులు సోదాలు నిర్వహించినప్పుడు క‌స్ట‌మ‌ర్ కేర్‌లో ఎవరు విధులు నిర్వహిస్తున్నారో వారిపై కేసులు నమోదు చేస్తారు.

More Telugu News