: అమ్మ పదం అంతరాళం నుంచి...మమ్మీ మూతి నుంచి వస్తాయి: వెంకయ్యనాయుడు

"వెంకటేశ్వరుని పాదాల చెంత ఇంత చక్కని కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో సీఎం, కేంద్ర మంత్రి పాల్గొనడం ఏంటని అనుమానం రావచ్చు. సీఎం వచ్చారంటే అర్ధముంది...ఆయన హీరోకి వియ్యంకుడు. నేను మాత్రం సమాచార ప్రసార శాఖ మంత్రిని. అందుకే వచ్చాను" అంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. తరాలుగా మనకు అందించిన వారసత్వాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. 'సినిమాను వినోదం కోసం తీస్తారు. కానీ సినిమాను చరిత్రను తెలిపే విధంగా తీయడం గొప్పవిషయ'మని ఆయన అన్నారు.

 తిరుపతికి రావడానికి ప్రధాన కారణంగా ఈ సినిమా నేపథ్యం, దీని గొప్పతనమని ఆయన చెప్పారు. బాలకృష్ణతో తన అనుబంధం వేరని ఆయన అన్నారు. తెలుగు వారి కీర్తి దశదిశలా నడిపించిన గొప్ప వ్యక్తి నందమూరి తారకరామారావు అని అన్నారు. రామారావు రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ను తరిమిన వ్యక్తి మాత్రమే కాదని, దేశంలోని వివిధ పార్టీలను ఏకం చేసిన వ్యక్తి ఆయనేనని అన్నారు. భారతదేశానికి ప్రధమ తెలుగు చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి అన్నారు.

 అమ్మా అంటే అది అంతరాళం నుంచి వస్తుందని, మమ్మీ అంటే మూతి నుంచి మాత్రమే వస్తుందని అన్నారు. అలాగే డాడీ, బీడీ, కేడీ అని పిలవద్దని ఆయన సూచించారు. పాత రోజుల్లో సినిమాలు చాలా రోజులు ఆడేవి...ఇప్పుడు సినిమాలు గుర్తులేవు, హీరోలు గుర్తుండరని అన్నారు. దేవుడ్ని చూస్తే మళ్లీ వెనక్కిరాము.. కానీ దేవుడు ఇలా ఉంటాడని ఎన్టీఆర్ ను చూసి చాలా మంది తెలుసుకున్నారని ఆయన గుర్తుచేశారు. యూనిట్ కు ధన్యవాదాలు తెలిపారు. 'సుమ, నువ్వు చాలా చక్కగా మాట్లాడుతున్నావమ్మా' అంటూ చివర్లో యాంకర్ సుమను అభినందించారు వెంకయ్యనాయుడు. 

More Telugu News