: అద్భుత విజయం... ఐదో టెస్టూ భారత్ దే!

టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన చివరిదైన ఐదో టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. అన్ని విభాగాల్లో రాణించిన భారత ఆటగాళ్లు సాధికారిక విజయాన్ని సాధించి, పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానానికి చేరుకున్నారు. ఇప్పటికే టెస్టు సిరీస్ ను సొంతం చేసుకున్న భారత జట్టు, ఐదు టెస్టుల సిరీస్ లో 4-0 తేడాతో విజయం సాధించింది. ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 477 పరుగులు చేసింది. దీటుగా ఆడిన భారత జట్టు కేఎల్ రాహుల్ (199), కరుణ్ నాయర్ (303) రాణించడంతో తొలి ఇన్నింగ్స్ లో 759 పరుగులు చేసింది.

దీంతో 282 పరుగులు వెనుకబడ్డ ఇంగ్లండ్ జట్టు భారత విజయాన్ని అడ్డుకునేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టును కేవలం 207 పరుగులకే రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శనతో కుప్పకూల్చాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు చివరి టెస్టును ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో కోల్పోయింది. ఏడు వికెట్లు తీసిన జడేజా కెప్టెన్ కుక్ ను సిరీస్ లో ఆరుసార్లు అవుట్ చేయడం యాదృచ్చికంగా జరిగిందని తెలిపాడు. టెస్టు విజయం ఆనందాన్నిచ్చిందని కోహ్లీ తెలిపాడు. అద్భుతమైన పిచ్ ను గ్రౌండ్స్ మన్ తయారు చేశారని, మెరుగైన జట్టే విజయం సాధించిందని కోచ్ కుంబ్లే చెప్పాడు. 

More Telugu News