: పోలీస్ అమరుడి కుమార్తెకు పెళ్లి జరిపించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి.. తండ్రి స్థానంలో నిలబడి ఘనంగా వివాహం!

అధికారిక కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఓ పోలీస్ అమరుడి కుమార్తె పెళ్లిని దగ్గరుండి ఘనంగా జరిపించారు. అతిథులను దగ్గరుండి ఆహ్వానించారు. సిమీ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన భోపాల్ జైలు హెడ్‌కానిస్టేబుల్ రామశంకర్ యాదవ్ కుమార్తె సోనియా వివాహంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రులతో కలిసి వేడుకకు హాజరైన సీఎం పెళ్లిలో అన్నీ తానై వ్యవహరించారు. పెళ్లితంతు ముగిసే వరకు అక్కడే ఉన్నారు. అక్టోబరు 30-31 రాత్రి భోపాల్ జైలులో ఉన్న సిమీ ఉగ్రవాదులు తప్పించుకునే క్రమంలో రామశంకర్ యాదవ్‌ను హత్యచేసిన సంగతి తెలిసిందే. అప్పటికే ఆయన కుమార్తె సోనియా వివాహం నిశ్చయమైంది. దీంతో సోనియాకు ఉద్యోగం ఇవ్వడంతోపాటు ఆ పెళ్లిని తానే దగ్గరుండి జరిపిస్తానని ముఖ్యమంత్రి చౌహాన్ అప్పట్లో హామీ ఇచ్చారు. అన్నట్టుగానే శుక్రవారం పెళ్లికి హాజరైన ముఖ్యమంత్రి దగ్గరుండి సోనియా వివాహాన్ని ఘనంగా జరిపించారు. అంతేకాదు, ముందు ప్రకటించినట్టు సోనియాకు గ్రేడ్-3 ఉద్యోగానికి సంబంధించిన అపాయింట్‌మెంట్ లెటర్‌ను పెళ్లిలో కానుకగా సోనియాకు అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుమార్తెల పెళ్లిళ్లు ఇక నుంచి ప్రభుత్వమే దగ్గరుండి జరిపిస్తుందని, పూర్తి ఖర్చులు భరిస్తుందని హామీ ఇచ్చారు. సోనియా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి కుమార్తె అని చౌహాన్ పేర్కొన్నారు. కాగా హెడ్‌కానిస్టేబుల్ కుమార్తె వివాహానికి హాజరై దగ్గరుండి పెళ్లి జరిపించిన ముఖ్యమంత్రిపై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News